All meadia

 

Sunday, 7 December 2014

యాదగిరిగుట్ట ఘాట్ పరిధిలో ఘోర ప్రమాదం.... లోయలో పడిన టాటా ఏస్ వాహనం...


  • హటాత్తుగా ముగ్గురి మృతి...
  •  కారును తప్పించబోయి లోయలో పడిన టాటా ఏస్‌...
  •  ముగ్గురి మృతి... 11 మందికి గాయాలు...
  • 11 మందికి గాయాలు.. మృతులు బోడుప్పల్‌ వాసులు...
  •  ఒకరి పరిస్థితి విషమం.. మృతులు బోడుప్పల్‌ వాసులు...
  •  దివాన్‌చెరువు ప్రమాదంలో ఇద్దరి మృతి...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డుపై వాహనం పల్టీ కొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌, ఘట్‌కేసర్‌ మండలం తేనుగూడెం నుంచి కొందరు శనివారం రాత్రి టాటా ఏస్‌ వాహనం(ఏపీ 10 డబ్ల్యూ 7206)లో లక్ష్మీనరసింహుడి దర్శనానికని బయల్దేరారు. ఘాట్‌రోడ్‌లో హోటల్‌ పున్నమి సమీపంలో గల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి వాహనం పల్టీకొట్టి లోయలో పడిపోయింది. దీంతో నర్సమ్మ, ఆంజనేయులు, కృష్ణగా భావిస్తున్న బోడుప్పల్‌ వాసులు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌ కాకి రాములు, పావని, విఘ్నేష్‌, స్వప్న మాధురి, కల్పన, తులసి, భరత్‌, లత, సౌమ్య, లక్ష్మి, వేణుగోపాల్‌ తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని లోయలో నుంచి బయటకు తీసిన పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఘట్‌కేసర్‌ మండలం తేనుగూడెం గ్రామానికి చెందిన గడ్డం వేణుగోపాల్‌ పరిస్థితి విషమంగా ఉంది. 
విశాఖకు వెళ్లి వస్తుండగా.. 
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 12 మంది ఒకే వాహనంలో శుక్రవారం విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన బచ్చు ఆంజనేయులు (39) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జీలుగుమిల్లి మండల కామయ్యపాలెం వాసి సీమకుర్తి మల్లిఖార్జునరావు (45) చికిత్స పొందుతూ రాజమండ్రి ఆస్పత్రిలో మృతి చెందాడు. 

No comments:

Post a Comment