All meadia

 

Friday, 28 August 2015

కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రేవంత్‌రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడం ఖాయమని నల్గొం డ టీడీపీ ఇన్‌చార్జి కంచెర్ల భూపాల్‌ రెడ్డి, పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో ఉంటున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిసేందుకు భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నేతలు గురువారం కొడంగల్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పరామిర్శించారు. రాబోయే రోజుల్లో కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరితో పాటు రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద మంది న్యాయవాదులు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారు.

7న సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్‌ కార్మికుల ధర్నా

పేపర్‌ మిల్లును సంరక్షించాలనే డిమాండ్‌తో తలపెడుతున్న ధర్నాకు హాజరు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కార్మికులు కోరారు. ఎన్నికలకు ముందు పేపర్‌ మిల్లు విషయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారని, దీనికి నిరసనగా భారీ ధర్నా తలపెడుతున్నట్లు, దీనికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలవాలని సమితి సభ్యులు ఉత్తమ్‌కుమార్‌ను కోరారు.

గుండె పోటుతో ఎమ్మెల్యే సోదరుడి మృతి

విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే,వైఎస్ ఆర్ సీపీ నాయకుడు జలీల్ ఖాన్ సోదరుడు మున్వర్ ఖాన్ (56) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.ఎమ్మెల్యే ఆయన సోదరుడు వన్ టౌన్ లోని  తారాపేటలోని నివాసం ఉంటున్నారు.
అయితే శుక్రవారం ఉదయం మున్వర్ ఖాన్ కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా  ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.మున్వర్ ఖాన్ మృతి పట్ల  పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.

ఎంత పెద్ద పామో!


  • రుయాలో 14అడుగుల కొండచిలువ
14 అడుగుల పొడవు. 40 కిలోల బరువు. పదేళ్ల వయసు. ఇంత పెద్ద కొండ చిలువ గురువారం తిరుపతిలోని రుయాస్పత్రిలో కలకలం రేపింది. రుయా ఆవరణలోని డీఎల్‌వో కార్యాలయం సమీపంలో పాడుపడిన సెప్టిక్‌ ట్యాంకు ఉంది. అందులోకి ఎప్పుడొచ్చిందో ఏమో కానీ.. ఈ పెద్ద కొండచిలువను ఉదయం 11.30 గంటల ప్రాంతంలో రోగుల సహాయకులు గుర్తించారు. భయంతో కేకలు వేశారు. ఈ విషయాన్ని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంధ్య, సీఎస్‌ ఆర్‌ఎం చంద్రయ్యలు టీటీడీ అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కొండ చిలువ ఉన్న సెప్టిక్‌ ట్యాంకులో నీళ్లు ఎక్కువగా ఉండటంతో ట్యాంక్‌ క్లీనర్‌ యంత్రాన్ని తీసుకొచ్చి నీటిని తోడేశారు. ఆ తర్వాత టీటీడీ ఫారెస్ట్‌ మేసి్త్ర భాస్కర్‌నాయుడు, ఆదిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు భాస్కర్‌నాయుడు చాకచక్యంగా కొండ చిలువను బయటకు తీసుకొచ్చి గోతాములో ఎస్వీ జూపార్కుకు తరలించారు. గతం లో ఇదే ప్రాంతానికి చిరుత వచ్చింది. కాగా, అటవీ ప్రాంతానికి దగ్గరగా రుయాస్పత్రి ఉండటంతో వన్య ప్రాణులు వస్తున్నాయని సీఎస్‌ఆర్‌ఎంవో చంద్రయ్య చెప్పారు.

ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ చేయాలి: బీజేపీ

రాష్ట్రంలోని ఉస్మానియా, జేఎన్‌టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో రెండోవిడత కౌన్సెలింగ్‌ తర్వాత ఇంకా 285 ఇంజనీరింగ్‌ సీట్లు ఖాళీగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. నిబంధనల కారణంగా ప్రభుత్వ కాలేజీలు వీటిని భర్తీ చేయడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల నెపంతో సీట్లు భర్తీ చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభమైన దృష్ట్యా ఈ సీట్ల భర్తీతో పాటు స్లైడింగ్‌, కాలేజీల మార్పునకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరారు.

ఉల్లి..లొల్లి

ఇదేదో రేషన్‌ కోసమో.. కిరోసిన్‌ కోసమో కట్టిన క్యూ కాదు.. మరి ఎందుకని అంటా రా!? రూ.20కే ఉల్లిగడ్డల కోసం..! రైతుబజార్‌ల వద్ద నెలకొన్న దుస్థితి ఇది. జిల్లా బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.65కి లభిస్తుండడంతో.. సామాన్యులు ప్రభుత్వం స బ్సిడీ ద్వారా రూ.20కి కిలో ఉల్లి గడ్డల కోసం గంటల తరబడి బారులు తీరుతున్నారు. గురువారం నగరంలోని పులాంగ్‌ చౌరస్తా వద్ద రైతుబజార్‌లో ఉల్లి గడ్డల కోసం కొనుగోలుదారులు ఏకంగా 3గంటల పాటు క్యూలో వేచి ఉన్నారిలా..

Thursday, 27 August 2015

జగన్ ధర్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారు : కేఈ

జగన్ ధర్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ధర్నాలకు రైతులు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అవసరమని అన్నారు. రాజధాని కోసం భూసేకరణ అవసరం లేదని, రైతులే స్వచ్చందంగా భూములు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్లు పాలనలో ఓ భాగమన్నారు. రాయలసీమ అభివృద్ధికి లక్షకోట్ల ప్యాకేజీ కావాలని కేఈ కోరారు.

ఇంజక్షన్ సైకో కోసం గాలింపు ముమ్మరం

ఇంజక్షన్ సైకో దాడి కారణంగా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. సైకో కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిడదవోలు, కొవ్వూరు, భీమవరం, ఏలూరు, ఆచంట తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సైకో కోసం గాలిస్తున్నాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. మరోవైపు సైకో దాడిలో బాధితుల సంఖ్య 13కు చేరింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్య

నెల్లూరు నగరంలోని వేదాయపాలెంకు చెందిన లక్ష్మయ్య ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు నగరంలో సంచలనం సృష్టించింది. సూసైడ్‌ నోట్‌లో ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నానని లక్ష్మయ్య పేర్కొన్నారు. జై ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలని లక్ష్మయ్య రాసిన సూసైడ్‌ నోట్‌లో లక్ష్మయ్య పేర్కొన్నాడు.

శిశువును కొరికి చంపిన ఎలుకలు

అనారోగ్యంతో పుట్టి వార్డులో చికిత్స పొందుతున్న శిశువును చూసుకోవడానికి వెళ్లిందా తల్లి. అక్కడ.. ఏ తల్లి కంటా పడకూడనంత ఘోర దృశ్యాన్ని చూసింది! పుట్టి వారం రోజులు కూడా కాని ఆ చిన్నారి ఒంటిపై దాదాపు పది ఎలుకలు మూగి ఇష్టం వచ్చినట్టుగా కొరికేస్తుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది వద్దకు వెళ్లి.. ‘‘అమ్మా నా బిడ్డ చనిపోయినా పర్లేదు.. కానీ, బతికుండగానే వాణ్ని అలా నా కళ్ల ముందే ఎలుకలు పీక్కు తింటుంటే చూడలేనమ్మా.. మీరన్నా బిడ్డ వద్ద ఉండండి. లేదా నాకు అనుమతివ్వండి, తీసుకెళ్లిపోతా’’ ..అంటూ హృదయవిదారకంగా రోదించినా వారి కరకు హృదయాలు కరగలేదు. చిన్నారిని కొరికి చంపుతున్న ఎలుకల కన్నా ఘోరంగా వ్యవహరించారు. ‘‘ఒసేయ్‌.. నీకూ నీ బిడ్డకు కాపలా కాయాలేం? ఇంత జాగ్రత్త గలదానికి రోగిష్టోడిని ఎట్టా కన్నావే? పోతే శవాన్ని నీకే ఇస్తాం.. మేమేం అమ్ముకోం. మాకు నీ బిడ్డ ఒక్కడే అనుకున్నావా? నిద్రపోనియ్యవే..’’ అంటూ ఈసడించారు. దీంతో ఆ తల్లి వేదన అరణ్య రోదనే అయింది. వరుసగా రెండు రోజుల పాటు మూషికాల దాడికి గురైన ఆ నవజాత శిశువు బుధవారం మధాహ్నం చనిపోయాడు. కోస్తాజిల్లాల్లోనే ఘనత వహించిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఘోరమిది.

వృద్ధాప్యానికి పింఛను ‘పరీక్ష’

సిబ్బంది 19 మంది.. వృద్ధాప్య పింఛనుదారులు వందలమంది. ఇంతమందినీ బయోమెట్రిక్‌ పద్ధతుల్లో పరీక్షించాలి. వారి వేలిముద్రలు బయో మిషన్‌కు సరిపోవాలి. అంతా పక్కాగా ఉన్నదనుకొంటేనే.. పింఛను అందించాలి. ఈ తతంగమంతా ముగిసేసరికి అరగంట నుంచి గంట సేపు పడుతుంది. అదీ మధ్యలో బయో మిషన్‌ మొరాయించకపోతేనే! ఇలా అవస్థలు పడినా.. రోజుకు ముఫ్ఫై మందికి మించి పరీక్షలు.. పింఛను మంజూరు జరిగే పరిస్థితి లేదు. హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని పోస్టాఫీసు వద్ద సతికిలబడిన ఈ వృద్ధులు పింఛను కోసమే ఇలా వేచిచూస్తున్నారు.

నేటి నుంచే ఐసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం తెలంగాణలో 16 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 30వ తేదీ వరకు ప్రక్రియ జరుగుతుంది. తొలిరోజు 1 నుంచి 15వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఇది పూర్తయ్యాక 28 నుంచి 31వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

జిల్లాకో డీ-అడిక్షన్‌ సెంటర్‌

మండలం యూనిట్‌గా ఊరూరా చీప్‌ లిక్కర్‌ విక్రయాలకు రంగం సిద్ధం చేస్తున్న తెలంగాణ సర్కారు.. అదే సమయంలో జిల్లాకో డీ అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు, అనర్థాల గురించి మందుబాబులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ల ఫైలుకు సీఎం కేసీఆర్‌ బుధవారం ఆమోద ముద్ర వేశారు. ఈ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు, అమృత, డిజైర్‌ వంటి ఫౌండేషన్లకు ఇవ్వనున్నారు. ఈ డీ-అడిక్షన్‌ సెంటర్ల కోసం ప్రభుత్వం రూ.50 కోట్లను ఖర్చు చేయనుంది.

Tuesday, 25 August 2015

నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత

మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి (67) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఎస్ఆర్‌నగర్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా కిష్టారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. కిష్టారెడ్డి నారాణ్‌ఖేడ్ మండలం పంచ గ్రామంలో జన్మించారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డికి శివారాజ్‌షెట్కర్ రాజకీయ గురువు.

ఇంటర్‌ ‘ప్రైవేటు’కు హాజరు మినహాయింపు

ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే ఆర్ట్స్‌ గ్రూప్‌ ప్రైవేటు(కాలేజీలో చదవని) విద్యార్థులకు హాజరు మినహాయించారు. ఈ మినహాయింపు పొందాలంటే విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 9లోగా హాజరు మినహాయింపు ఫీజుతోపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రూ.200 లేట్‌ఫీజుతో వచ్చే నెల 16 నుంచి 30 వరకు ఫీజు చెల్లించొచ్చు.

ఓబీసీ, ఈబీసీల విదేశీ విద్యకు సబ్సిడీ రుణం

విదేశాల్లో పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసించదలుచుకున్న ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ‘అంబేద్కర్‌ సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఇంట్రస్ట్‌ సబ్సిడీ’ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2015-16 విద్యాసంవత్సరంలో విదేశాల్లో చదుకోవాలనుకునే వారికి బ్యాంకులు వడ్డీలేని రుణం అందిస్తాయి. ఈ రుణం పొందాలనుకునే ఓబీసీ విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు, ఈబీసీ విద్యార్థుల ఆదాయ పరిమితి రూ.లక్ష లోపు ఉండాలని తెలంగాణ బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టీ.రాధ ఒక ప్రకటనలో తెలిపారు.

గ్రామజ్యోతి’ అఖండం.. ఆరకుండా కొనసాగించాలి: కేసీఆర్‌

‘ఈ రోజుతో గ్రామజ్యోతి కార్యక్రమం ముగిసిపోలేదు. ఈ జ్యోతిని వెలిగించాం. ఇది ఆరిపోకుండా కొనసాగుతూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. దీనిని కొనసాగించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని ప్రజాప్రతినిధులందరిదీ. వైరుధ్యాలు, విబేధాలను వీడి అంతా ముందుకు సాగాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పల్లెలను బంగారు సీమలుగా తయారు చేసుకోవాలన్నారు. అందరూ కలిసి పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. తాను దత్తత తీసుకున్న కరీంనగర్‌ జిల్లా చిన్న ముల్కనూర్‌లో సోమవారం జరిగిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. గ్రామ జ్యోతిలో తమకు భాగస్వామ్యం కల్పించడంలేదంటూ ఎంపీటీసీ, జడ్పీటీసీ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... ‘‘సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు అందరూ పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ప్రతినిధులే. అందరూ సమాన బాధ్యులే. ఈ విషయంలో కొందరు అపార్థంలో ఉన్నారు. వాటిని విడనాడి గ్రామసభల్లో పాల్గొని.. అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి అమలు చేయూలి’’ అని కేసీఆర్‌ కోరారు.

మైండ్‌సెట్‌ మార్చుకోండి- పోలీస్ బాస్ కౌన్సిలింగ్

మారేడ్‌పల్లిలో బన్నప్ప, ఆసిఫ్‌నగర్‌లో పద్మ లాకప్‌డెత్‌. పోలీసుల ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నగర పోలీస్‌ కమిషనర్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఆసిఫ్‌నగర్‌ ఠాణాలో ఆదివారం జరిగిన లాకప్‌ డెత్‌పై కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సీరియస్‌గానే స్పందించారు. అదే స్టేషన్‌లో పనిచేస్తున్న ఏడుగురి సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌నూ ఆదివారమే బదిలీ చేశారు.

కిలో సబ్సిడీ ఉల్లి కోసం 3 వేల మంది క్యూ

ఒకచోట ఉల్లిపాయల దొంగతనం.. ఇంకోచోట కేజీ సబ్సిడీ ఉల్లి కోసం 3 వేల మంది క్యూ.. మరోచోట మహిళల తోపులాట.. రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.60-80 దాకా పలుకుతున్న నేపథ్యంలో ఊరూరా కనిపిస్తున్న ఉల్లి లొల్లి ఇది. ధరాభారం తట్టుకోలేని సామాన్యులకు ఉల్లిని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఏపీ సర్కారు కేజీ రూ.20కే ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాలకొల్లు పట్టణం మొత్తానికీ ఏఎంసీ ప్రాంగణంలో ఒకే ఒక్క విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి రెండు నుంచి మూడు వేల మంది దాకా రావడంతో పెద్ద క్యూ ఏర్పడింది. కుటుంబంలోని ఎంతమంది ఉంటే అంతమందీ ఆధార్‌ కార్డులు పట్టుకువస్తేనే ఉల్లి ఇస్తామని ఆంక్షలు విఽధించడంతో మహిళలు చంటిబిడ్డలను సైతం భుజాన వేసుకుని మండుటెండలో బారులుతీరారు. దీంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశంచేసి వారిని అదుపుచేశారు. మరోవైపు.. విశాఖలోనూ ఇలాంటి దృశ్యాలే ఆవిష్కృతమయ్యాయి. కేజీ సబ్సిడీ ఉల్లి కోసం ఉదయం 5 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అయితే.. క్యూలో ఉన్నవారికి కాకుండా బయటివారికి ఉల్లిపాయలు ఇస్తున్నట్టు ప్రచారం జరగడంతో అంతా ఒకేసారి కౌంటర్‌వైపు దూసుకెళ్లారు. దీంతో తోపులాట, తొక్కిసలాట జరిగి కొందరు మహిళలు కింద పడిపోయారు. వారిలో కొందరికి స్పృహ తప్పింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్‌డీఓ, డీఎస్‌ఓ తదితరులు సందర్శించి క్యూ పద్ధతిలో వచ్చినవారికే ఉల్లి పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. మరోవైపు.. మహారాష్ట్రలో వరుసగా రెండోరోజూ ఉల్లి చోరీ జరిగింది. ఆదివారం ముంబైలో దొంగలు 7 క్వింటాళ్ల ఉల్లిని చోరీ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నాసిక్‌లోని నందగావ్‌ తాలూకా పింపడ్‌ఖేడ్‌ గ్రామంలో ఒక గోదాములో నిల్వ ఉంచిన 2000 కిలోల (20 క్వింటాళ్లు) ఉల్లిని దొంగలు ఎత్తుకుపోయినట్టు అబాసాహెబ్‌ పవార్‌ అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.60 లక్షల దాకా ఉంటుందని అంచనా.

వెబ్‌సైట్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ

నిరుద్యోగులు, గృహిణులు, శారీరక వికలాంగుల కోసం హ్యాపీ వె బ్స్‌ సంస్థ ద్వితీయ వార్షికోత్పవం సందర్భంగా సృజనాత్మక వెబ్‌సైట్‌ డిజైనింగ్‌లో వా రం రోజుల పాటు ఉచిత శిక్షణ అందిచనున్నట్లు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ శ్రీలత వెంకట్‌ తెలిపారు. ఇందులో హెచ్‌ఎమ్‌ఎల్‌, డాట్‌నెట్‌, సీఎన్‌ఎన్‌, ఇమేజ్‌ ఎడిటింగ్‌, డొ మైన్‌ మేనేజ్‌మెంట్‌, హోస్టింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఈ-కామర్స్‌, ఈ-గేట్‌ వే, ఈ-గవర్నె న్స్‌, ఎస్‌ఈఓ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ శిబిరం ఆగస్టు 31న ప్రారంభమై ప్రతిరోజు 4గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇందులో పాల్గొనదలిచిన ఆస క్తిపరులు ఈ నెల 29వ తేదీలోగా పేర్లను నమోదు చేసుకోవాలని, వివరాలకు 040-65699333, 9908520903లలో సంప్రదించాలన్నారు.

Monday, 24 August 2015

మాజీ ఎమ్మెల్యే మస్కతి కన్నుమూత

హైదరాబాద్;చార్మినార్ మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి కన్నుమూశారు.అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతతో సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన అంత్య క్రియలను కంచన్ బాగ్ లోని కబరస్తాన్ లో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడిగా  కుడా పనిచేసిన ఆయన మస్కతి పేరుతో పాల డెయిరీని స్థాపించారు.

స్కాలర్ షిప్ ల కోసం మంత్రి ఇళ్లు ముట్టడి

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు.కాగా,పోచారం ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.వెంటనే పెండింగ్ లో ఉన్న ఇంటర్ డిగ్రీ స్కాలర్ షిప్ లను చెల్లించాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో విద్యార్దులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

వచ్చే విద్యాసంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహిస్తాం - మంత్రి కడియం

వచ్చే విద్యాసంవత్సరం లోగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. డైట్‌సెట్‌ ఫలితాలను మంత్రి కడియం విడుదల చేశారు. సెప్టెంబరు నెలాఖరులోగా విద్యావాలంటీర్లను నియమిస్తామన్నారు. రేషనలైజేషన్‌ ప్రక్రియ కొలిక్కి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

నేడు షాద్‌నగర్‌కు గవర్నర్‌ రాక

గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌, ఫరూక్‌నగర్‌ మండలాల్లో పర్యటించనున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

గ్రామస్థులపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే గువ్వల అనుచరులు

జిల్లాలోని వంగర మండలం అన్నారంలో ప్రజా సమస్యలను పరిష్కరించమన్న గ్రామస్థులపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ అనుచరులు చేయి చేసుకున్నారు. జిల్లాలో నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రజాసమస్యలపై ఇద్దరు వికలాంగులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు వికలాంగులపై చేయిచేసుకున్నారు. ఇందుకు నిరసనగా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

విద్యార్థులతో గవర్నర్‌ నరసింహన్‌ ముఖాముఖి

ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ పాఠశాల ఆవరణలో గ్రామజ్యోతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు నరసింహన్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ విద్యార్థులతో మాట్లాడారు. సర్పంచి, కమిటీ సభ్యులతో గ్రామ సమస్యలను గవర్నరు అడిగి తెలుసుకున్నారు.

తలసాని వ్యవహారంపై టీటీడీపీ మళ్లీ పోరుబాట

తలసాని రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి తెలంగాణ స్పీకర్‌ను కలవాలని నిర్ణయించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ మధుసూదనాచారితో సమావేశంకానున్నారు. తలసాని రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని మరోసారి స్పీకర్ను కోరనున్నారు.

నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హెచ్‌1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో రెండు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో హెచ్‌1 బోగి ఏసీ టెక్నిషియన్‌ అహ్మద్‌, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌లు ఉన్నారు.

Sunday, 23 August 2015

డీసీపీ ఆధ్వర్యంలో పోకిరీలకు కౌన్సెలంగ్

రాత్రిళ్లు నగరంలో సంచరించే పోకిరీలకు పోలీసులు కౌన్సెలంగ్ ఇచ్చారు. శనివారం అర్థరాత్రి పాతబస్తీ ఏరియాలో సంచరిస్తున్న 100 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం వారికి డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమీక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు

ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి

షాద్ నగర్:     పట్టణంలోని పటేల్ రోడ్డులో నివాసముంటున్న ఓ కుటుంబం ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యలు ప్రాణాలు కోల్పోయారు. ఉడిషావత్ గోపాల్ (లారీడ్రైవర్) అతని భార్య విజయ కొద్దికాలంగా పిల్లలతో పటేల్ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. గోపాల్ లారీ పని నిమిత్తమై వెళ్లగా విజయ(38) తమ పిల్లలతో ఉంది. వీరందరు ఈ తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ(38), చరణ్(06), చిట్టి(13) మృతి చెందగా భరత్,నిహారికలను చికిత్సనెమిత్తమై ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.

30న అంబేద్కర్ వర్సిటీ రెండో విడత ప్రవేశ పరీక్ష

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రెండో విడత ప్రవేశ పరీక్ష ఈ నెల 30న నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24 వరకు ఆఖరి గడువని తెలిపారు.పరీక్షకు రెండు రోజుల ముందు హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

మహిళపై చేయిచేసుకున్న కేసులో ఎస్‌ఐని సస్పెండ్‌

ఓ మహిళపై చేయిచేసుకున్న కేసులో నల్గొండ జిల్లా, పీఏ పల్లి ఎస్‌ఐని సస్పెండ్‌ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓ గిరిజన మహిళను వేధించాడన్న ఆరోపణలతో గుడిపల్లి ఎస్‌ఐ కొండల్‌రెడ్డిని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సస్పెండ్ చేశారు.

బీ కేటగిరీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం

బీ కేటగిరీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. కస్టోడియల్‌ సర్టిఫికెట్లను అనుమతించని అధికారులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తేనే సీటు కేటాయిస్తామని తేల్చిచెప్పారు. దీంతో అర్హులైన విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థతి ఏర్పడింది.  ఇవాళ కౌన్సిలింగ్‌ చివరి రోజు కావడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థులు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

29 నుంచి వ్యవసాయ కోర్సుల కౌన్సెలింగ్‌

హైదరాబాద్;వ్యవసాయ డిప్లొమా కోర్సుల రెండో విడత కౌన్సెలింగ్‌ 29 నుంచి రాజేంద్రనగర్‌లోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో జరుగుతుందని వర్సిటీ ప్రత్యేకాధికారి వి.ప్రవీణ్‌రావు తెలిపారు. ఇతర వివరాలకు www.pjtsau.ac.inలో చూడవచ్చన్నారు.

ఐ-సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐ-సెట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిం ది. 27నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 28 నుంచి 31 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని కౌన్సెలింగ్‌ క్యాం పు ఆఫీసర్‌ బి. శ్రీనివాస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 2న సీట్లు కేటాయిస్తారు.

మెడికల్‌ కౌన్సెలింగ్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

హైదరాబాద్;   ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఉస్మానియా వర్సిటీలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈలో శనివారం జరిగిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు యత్నించారు. కౌన్సెలింగ్‌ కేం ద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పో లీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపై ఆం దోళనకు దిగిన విద్యార్థులను అరెస్టుచేసి నల్లకుంట ఠాణాకు తరలించారు. దీనికి నిరసనగా ఓయూలో ర్యాలీ నిర్వహించారు

అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మహిళ లాకప్ డెత్

హైదరాబాద్;అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలు అయిన పద్మ అనుమానాస్పదంగా మృతిచెందారు. భోజగుట్టకు చెందిన పద్మ అనే మహిళను ఓ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు విచారిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం ఆమె ఓ కేసులో నిందుతురాలని విచారణ నిమిత్తమే పిలిపించామని వారు తెలుపుతున్నారు. ఆమె మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందిందని పోలీసులు తెలుపుతున్నారు.

Saturday, 22 August 2015

చిరు బర్త్‌డేకు అమితాబ్‌, సల్మాన్‌, రజనీ

మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలకు బాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి ప్రముఖులను ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శనివారం ఒక హోటల్‌లో వీటిని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన భార్య జయాబచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, అతడి కుటుంబ సభ్యులు, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, శ్రీదేవి, బోనీ కపూర్‌, టబూ, అందరినీ ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చిరంజీవి తనయుడు రాంచరణ్‌ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వేడుకల్లో ఏర్పాటుచేసిన వంటకాల్లో ‘చిరంజీవి దోసె’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనిపై హక్కులను పొందేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇక నుంచి హోటళ్లలో ఆ పేరుతోనే దోసెను అందుబాటులో ఉండేలా చేస్తామని ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఒకరు తెలిపారు.

విషాహారం తిని 24 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రొద్దుటూరు ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో విషాహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. విషాహారం అవడంపై పాలిటెక్నిక్‌ కళాశాల అధికారులు దర్యాప్తు ఆరంభించారు.

ఎర్రబెల్లి, మందకృష్ణపై మండిపడ్డ డిప్యూటీ సీఎం కడియం

టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఎర్రబెల్లి దయాకర్‌రావు తన భాష తీరును మార్చుకోవాలన్నారు. తనకు మంత్రి పదవిని ఇప్పించానని అంటున్న ఎర్రబెల్లి మాటలను చూసి నవ్వుకోవాల్సి వస్తోందన్నారు. ఇక మంద కృష్ణ మాదిగ రోజుకో మాట, పూటకో పార్టీతో ఉంటారన్నారు. మంద కృష్ణ వ్యవహరశైలితో మాదిగలంతా ఎమ్మార్పీఎస్‌కు దూరమవుతున్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.

ఫలించిన కేశినేని నాని కృషి

నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ కేశినేని నాని చేస్తున్న కృషి ఫలించింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 254 గ్రామాల అభివృద్ధికి టాటా ట్రస్ట్ ప్రణాళికను రూపొందించిందని కేశినేని నాని తెలిపారు. ఈనెల 24న ఈ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్‌టాటా విడుదల చేస్తారని నాని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని టాటా ట్రస్ట్ దత్తత తీసుకుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 23న రతన్‌టాటా విజయవాడ రానున్నారు. అనంతరం ఆయన చంద్రబాబుతో సమావేశం అవుతారు.

ఏటీఎంలా ఎనీ టైం లిక్కర్‌ను ప్రోత్సహిస్తోన్న కేసీఆర్

ఏటీఎంలా... ఎనీ టైం లిక్కర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని సీపీఐ సినియర్ నేత సుధాకర్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.... చీప్ లిక్కర్ ప్రవేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ప్రభుత్వాన్ని బొందపెడతామన్నారు. సీఎం కేసీఆర్ 8వ నిజాం‌లాగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

విమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం

విమ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన బీజేపీ నేత రామన్‌బాల్లాను వెంటనే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ విమ్స్‌ జంక్షన్‌లో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా చేశారు.

Friday, 21 August 2015

కశ్మీర్‌ వేర్పాటువాదులతో భేటీకి పాక్‌ సిద్ధం సందిగ్ధంలో ఎన్‌ఎస్‌ఏ సమావేశాలు...

భారత్‌ - పాక్‌ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందిగ్ధంలో పడింది. కశ్మీర్‌ వేర్పాటువాదులతో భేటీ విషయంలో పాకిస్తాన్‌ వెనక్కి తగ్గకుంటే సమావేశాన్ని రద్దు చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఆఖరి సారిగా పొరుగు దేశానికి గట్టి హెచ్చరికలు పంపింది. పాక్‌ పదే పదే తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది. భారత్‌ అభ్యంతరాలను భేఖాతర్‌ చేస్తూ.. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిజ్‌ కశ్మీర్‌ వేర్పాటువాదులతో భేటీకి అయ్యేందుకే సిద్ధమవుతున్నారు ఆదివారం (23వ తేదీ) ఇరు దేశాల మధ్య ఎన్‌ఎస్‌ఏ సమావేశాలు జరగాల్సి ఉంది.

జూబ్లీహిల్స్‌ కాల్పుల కేసులో పురోగతి

జూబ్లీహిల్స్‌ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురు నిందితులు పహీమ్‌, సత్తార్‌, షబ్బీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఓటు తప్పనిసరి కాదు

ఎన్నికల్లో ఓటెయ్యడం తప్పనిసరి చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఓటెయ్యకపోతే వందరూపాయల జరిమానా కూడా విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. వంద శాతం ఓటింగ్ సాధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయకపోవడం సరైంది కాదనేది గుజరాత్ ప్రభుత్వ వాదన. అందుకే కంపల్సరీ ఓటింగ్ చట్టం తీసుకొచ్చింది. అయితే దీనిపై గుజరాత్ హైకోర్టు ప్రస్తుతానికి స్టే విధించింది.

చీప్ లిక్కర్‌ పాలసీకి కాంగ్రెస్‌ వ్యతిరేకం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన చీప్ లిక్కర్‌ పాలసీకి కాంగ్రెస్‌ వ్యతిరేకమని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నేరేడుచర్ల మండలంలో ఉత్తమ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చీప్‌ లిక్కర్‌ పాలసీ కారణంగా యువత పక్కదోవ పడుతుందన్నారు. చీప్‌ లిక్కర్‌ పాలసీపై మహిళలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. రైతులకు వెంటనే రూ.లక్ష రుణమాఫీ చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

ఏపీ రాజధానికి ఉద్యోగుల తరలింపునకు రంగం సిద్ధం

ఏపీ రాజధానికి ఉద్యోగులను తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. విధి విధానాలను రూపొందించిన ప్రభుత్వం వ్యక్తిగతంగా ఒక్కో ఉద్యోగికి ప్రొఫార్మా ఇవ్వనున్నారు. ఉద్యోగి పేరు, హోదా, పిల్లల చదువులు, అమరావతికి తరలివెళ్లడానికి సిద్ధమా అనే అంశాలపై సర్కారు వివరాలను సేకరించనుంది.

కేసీఆర్‌ను కలిసిన కాప్రా మున్సిపల్‌ కార్మికులు

జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాప్రా మున్సిపల్‌ కార్మికులు కలిశారు. తొలగించిన మున్సిపల్‌ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఓయూలో బీ కేటగిరి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఓయూలో బీ కేటగిరి మెడికల్‌ కౌన్సెలింగ్‌ శుక్రవారం ప్రారంభం అయింది. ఈ కౌన్సెలింగ్‌ రేపటివరకు నిర్వహించనున్నట్లు వైద్య విద్యాశాఖాధికారులు చెప్పారు. కాగా మెడికల్‌ ఫీజులు తగ్గించాలని డిమాండు చేస్తూ ఓయూలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ను విద్యార్థి సంఘాల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో 30 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్తత రాజుకుంది.

Thursday, 20 August 2015

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 నీరూన్ షోరూం వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చోటు చేసుకుంది ద్విచక్రవాహనం పై వెళుతున్న వ్యక్తిని టాన్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుకోగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం ఈ సంఘటనలో అక్కడే పనిచేస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో నిర్మాణ కార్మికుడు ధర్మేందర్ సింగ్ ఛాతీలోకి తూటా దూసుకెళ్లింది.దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.కాల్పులకు గురైన భాదితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ టీఆర్‌ఎస్వీ, జాగృతి విద్యార్థి నేతలు నిరుద్యోగులను మోసం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు టీఆర్‌ఎస్వీ,జాగృతి విద్యార్థి నేతలు నవీన్‌గౌడ్‌, రామ్మోహన్‌ను అరెస్ట్ చేశారు.

సీఎం కేసీఆర్ సభలో పాము కలకలం

మెదక్;   జిల్లాలోని ఎర్రవల్లిలో నిర్వహించిన సీఎం కేసీఆర్‌ సభలో ఓ పాము కలకలం సృష్టించింది. సభా ప్రాగణంలోకి పాము రాగానే అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పామును పట్టుకునేందుకు యత్నించగా అది పుట్టలోకి వెళ్లిపోయింది. ఈ ఉదయం ఎర్రవల్లిలో పర్యటించిన సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నాగం ఉద్యమ వేదికతో బీజేపీకి సంబంధం లేదు : కృష్ణసాగర్

నాగం జనార్దన్‌రెడ్డి ప్రారంభించిన ఉద్యమ వేదికతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు అసలు ప్రతిపక్షం బీజేపీనే అని అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై ఉద్యమం ఉదృతం చేస్తామని కృష్ణసాగర్‌ తెలిపారు.

ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ చేసేందుకు ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చినట్లు రాంనగర్‌లోని సాధన కళాశాల ఓపెన్‌ స్కూల్‌ కరస్పాంటెండెంట్‌ డాక్టర్‌ మహ్మద్‌ ఆలీ తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ చేయాలనే ఆసక్తి గల విద్యార్థ్ధులు వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవడానికి గడువును ప్రభుత్వం పొడిగించిందని ఆయన వివరించారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా వచ్చే సంవత్సరంలో కేవలం 5 పేపర్లు పాసైతే ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్‌ వస్తుందని తెలిపారు. ఈ కోర్సు చేయడానికి పదో తరగతి పాసై ఒక సంవత్సరం గ్యాప్‌ ఉన్న వారు లేదా ఏదైనా కారణం చేత చదువు ఆపేసిన వారు ఓపెన్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. బైపీసీ పాసైన విద్యార్ధులు ఎంసెట్‌ రాసి డాక్టర్‌ కోర్సులో లేదా కొత్తగా డీ-ఫార్మసీ కూడా చేసుకోవడానికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతకు అనుమతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు వివరాలకు సెల్‌ నెంబర్‌ 9247476873 లో సంప్రదించాలని ఆయన కోరారు.

చంద్రబాబు చేతుల్లో భద్రంగా విద్యార్థుల భవిష్యత్‌ :గంటా.....విద్యాకేంద్రంగా తాడేపల్లిగూడెం : మంత్రి మాణిక్యాలరావు

ఏపీ విద్యార్థుల భవిష్యత్‌ చంద్రబాబు చేతుల్లో భద్రంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం నిట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్ అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ర్యాగింగ్‌ నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం మంత్రి గంటా స్పష్టం చేశారు.
 
పగో జిల్లాపై చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని మరో మంత్రి మాణిక్యాలరావు అన్నారు. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే తాడేపల్లి గూడెంను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు కోరారు. నిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్య, స్మృతి ఇరానీ, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఏపీ సీఎం, సీఎస్‌ కార్యాలయాలు విజయవాడకు తరలింపు!

హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్‌ల కార్యాలయాలు, కేబినెట్‌ సెక్షన్లను విజయవాడలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లాట్స్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నా : ఎర్రబెల్లి

అనుచరులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ధర్నాకు దిగిన రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పాలకుర్తిలో రేపు మంత్రి పర్యటన ఉంది...స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు ఇంత వరకు సమాచారం లేదు మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గుండాగిరీ చేస్తున్నారని విమర్శించారు. జూపల్లి కర్నాటక సరిహద్దు వద్ద డ్రామాలు ఆపి, ఢిల్లీ వెళ్లి అక్రమ ప్రాజెక్టులను ఆపించాలని ఎర్రబెల్లి హితవు పలికారు.

Wednesday, 19 August 2015

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుంది? : ఎర్రబెల్లి

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మారిస్తే జాతీయ హోదా ఎలా వస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ... ఒకవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే సీఎం కేసీఆర్ ఏ ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారంటూ ఆయన విమర్శించారు. పూర్తిగా కరువు కాటకాల్లో ఉండే వరంగల్ జిల్లా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌కు దేవాదుల ప్రాజెక్టు వల్లే నీరు వస్తున్నాయని, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావుకు మతి భ్రమించిందని, టీఆర్ఎప్ నేతలకు వారి వారి భార్యలు అన్నం పెట్టకపోయినా... దానికి టీడీపీనే కారణం అనేట్లుగా ఉన్నారని ఆయన ఛలోక్తులు విసిరారు.

అప్పా డీఐజీని తెలంగాణ సీఎస్ దూషించిన వైనంపై..గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: డీజీపీ జేవీ రాముడు

అప్పా డీఐజీని తెలంగాణ సీఎస్ దూషించిన వైనంపై.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 15 రోజుల్లో విజయవాడలో డీజీపీ క్యాంప్ ఆఫీస్ సిద్దమవుతుందని, ప్రస్తుతానికి సీఎం క్యాంప్ ఆఫీస్ సమీంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో క్యాంప్ కార్యాలయం, నివాసంగా ఏర్పాటుచేసుకొని గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు. కాగా... పోలీస్ శాఖ నూతన భవనాలకు రూ.7 వేల కోట్లు అవసరమని, అలాగే భవనాల నిర్మాణాలకుగానూ వివిధ ప్రాంతాల్లో 3,300 ఎకరాలను పరిశీలిస్తున్నామన్నారు.

మంత్రి అచ్చెన్నాయుడితో బాలకృష్ణ భేటీ

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడితో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ బుధవారం ఉదయం ఏపీ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గ సమస్యలపై మంత్రితో బాలయ్య చర్చించినట్లు తెలుస్తోంది.

డెంగీ మరణాలను పట్టించుకోని ప్రభుత్వం : వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తూ మరణాలు సంభవిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర్రంలో గత వారం రోజులుగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ, మలేరియా మరణాలు అధికమయ్యాయని, ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. అలాగే... చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చేప్పారు.

ఆర్టీసీ చార్టీలు పెరిగే అవకాశం, సీఎం వద్దకు చార్జీల పెంపు ప్రతిపాదనలు

ఆంధ్రాలో త్వరలో ఆర్టీసీ చార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు చార్జీల పెంపు ప్రతిపాదనలు వెళ్లాయి. ఆయన నిర్ణయం కోసం ఆర్టీసీ సంస్థ ఎదురుచూస్తోంది. ఈ విషయాలను ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... స్వల్పంగా చార్జీలు పెంచాలని మూడు ప్రతిపాదనలను సీఎం వద్దకు పంపామన్నారు. అయితే.. గత ఏడాదితో పోలిస్తే 85 శాతం నష్టాలు తగ్గాయని, ఈ ఏడాది త్రైమాసికంలో రూ. 25 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. డీజిల్ రేటు తగ్గడం వల్ల రూ. 65 కోట్లు, అంతర్గత సామర్థ్యం పెంపు వల్ల రూ. 70 కోట్ల నష్టం తగ్గిందన్నారు. ఇక ఇటీవల ప్రకటించిన ఫిట్‌మెంట్ వల్ల నెలకు రూ. 55 కోట్ల మేర అదనపు భారం పడుతోందన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతాయని, డిసెంబర్ 20లోగా పూర్తిస్థాయిలో ఉద్యోగుల తరలింపు జరుగుతుందని తెలిపారు.

చీప్‌ లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా - నాగం ...తెలంగాణ బచావో మిషన్‌ ప్రారంభం

గుడుంబా తాగితే అనారోగ్యం పాలైతే... చీప్‌లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా అని మాజీమంత్రి, తెలంగాణ బచావో మిషన్‌ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బచావో మిషన్‌ కార్యాలయాన్ని నాగం ప్రారంభించారు. కేసీఆర్‌ ఏడాదిలో మూడుసార్లు కాన్వాయ్‌ మార్చారని, మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

మోదీతో చంద్రబాబు భేటీ వాయిదా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో రేపటి(గురువారం) ఏపీ సీఎం చంద్రబాబు భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల రేపు సమయం ఇవ్వలేకపోతున్నామని ప్రధాని కార్యాలయం నుంచి ఏపీసీఎంవోకు లేఖ అందింది. ఈనెల 25 లేదా 28, 29,31 తేదీల్లో ఏ రోజు వీలైతే ఆరోజు అపాయింట్‌మెంట్‌ ఇస్తామని పీఎంవో తెలిపింది. ఈ నాలుగు రోజుల్లో ప్రధానితో అపాయింట్‌మెంట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

25న హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎదుట ఆందోళన చేస్తాం : తమ్మినేని

పేదలకు డబుల్‌ బెడ్‌ రూం పథకం ఇంత వరకు అమలు చేయలేదని, దీనిపై ఈ నెల 25న హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎదుట ఆందోళన చేస్తామని తెలంగాణ సీపీఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపివేయాలన్నారు. అలాగే పాఠశాలలు, ఆస్పత్రులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అవి అధ్వాన్న స్థితిలో ఉన్నా... కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.