బతుకినిచ్చే తెలంగాణ కావాలని ప్రజలు పోరాటం చేశారని, బంగారు తెలంగాణను ఎవరూ కోరడంలేదని అరుణోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక బుధవారం నిర్వహించిన బహిరంగ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు పాలమూరుకు వలస జిల్లాగా పేరు రావడానికి గత పాలకులే కారణమన్నారు. విద్యావంతులు చైతన్యమై వలసల నివారణకు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూములను బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. విద్యావంతులైన ప్రతి ఒక్కరూ, ఈ విధానాలను ఎండగట్టకపోతే రాష్ట్రం మళ్లీ 60 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పోలీసులకు అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేసిన ప్రభుత్వం, పేదలకు భూపంపిణీ చేయడంలో ఎందుకు వెనుకంజ వేస్తోందని ఆమె ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తామన్న ప్రభుత్వం బడాబాబుల అక్రమ కట్టడాలను వదిలేసి, పేదల గుడిసెలను తొలగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాకారుల బృందంతో కలిసి విమలక్క నిర్వహించిన ఆటాపాట జనాన్ని ఉర్రూతలూగించింది.
No comments:
Post a Comment