అనారోగ్యంతో పుట్టి
వార్డులో చికిత్స పొందుతున్న శిశువును చూసుకోవడానికి వెళ్లిందా తల్లి.
అక్కడ.. ఏ తల్లి కంటా పడకూడనంత ఘోర దృశ్యాన్ని చూసింది! పుట్టి వారం రోజులు
కూడా కాని ఆ చిన్నారి ఒంటిపై దాదాపు పది ఎలుకలు మూగి ఇష్టం వచ్చినట్టుగా
కొరికేస్తుంటే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. రాత్రి విధుల్లో ఉన్న
సిబ్బంది వద్దకు వెళ్లి.. ‘‘అమ్మా నా బిడ్డ చనిపోయినా పర్లేదు.. కానీ,
బతికుండగానే వాణ్ని అలా నా కళ్ల ముందే ఎలుకలు పీక్కు తింటుంటే చూడలేనమ్మా..
మీరన్నా బిడ్డ వద్ద ఉండండి. లేదా నాకు అనుమతివ్వండి, తీసుకెళ్లిపోతా’’
..అంటూ హృదయవిదారకంగా రోదించినా వారి కరకు హృదయాలు కరగలేదు. చిన్నారిని
కొరికి చంపుతున్న ఎలుకల కన్నా ఘోరంగా వ్యవహరించారు. ‘‘ఒసేయ్.. నీకూ నీ
బిడ్డకు కాపలా కాయాలేం? ఇంత జాగ్రత్త గలదానికి రోగిష్టోడిని ఎట్టా కన్నావే?
పోతే శవాన్ని నీకే ఇస్తాం.. మేమేం అమ్ముకోం. మాకు నీ బిడ్డ ఒక్కడే
అనుకున్నావా? నిద్రపోనియ్యవే..’’ అంటూ ఈసడించారు. దీంతో ఆ తల్లి వేదన అరణ్య
రోదనే అయింది. వరుసగా రెండు రోజుల పాటు మూషికాల దాడికి గురైన ఆ నవజాత
శిశువు బుధవారం మధాహ్నం చనిపోయాడు. కోస్తాజిల్లాల్లోనే ఘనత వహించిన గుంటూరు
ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఘోరమిది.
No comments:
Post a Comment