All meadia

 

Thursday, 29 May 2014

పోలవరం ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ పోరుబాట

-అసంపూర్ణ తెలంగాణపై మొదటినుంచి హెచ్చరికలు
-అప్రమత్తంగా ఉండాలన్న గులాబీ నేత
-తెలంగాణను ముంచుడే ఆ ఇద్దరు సీమాంధ్ర నేతల
పని అని మండిపడుతున్న తెలంగాణవాదులు
-అధికారంలోకి వచ్చినా మళ్లీ ఉద్యమబాట పట్టిన తెలంగాణ ఇంటి పార్టీ

పోలవరం ప్రాజెక్టుపై మడమతిప్పకుండా టీఆర్‌ఎస్ పార్టీ పోరాటం సాగిస్తున్నది. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటిస్తూనే లక్షలాది మంది గిరిజనులను ముంచే పోలవరం డిజైన్‌ను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నది. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇక్కడి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మరోసారి ఉద్యమజెండాను ఎగురవేసింది.


Car-TRSకేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వైఎస్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించారు. విలేకరులు వైఎస్‌ను అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నిస్తే.. ప్రాజెక్టులు అనుమతులు వచ్చాకే ఎక్కడైనా కడుతున్నారా? ప్రాజెక్టును కట్టినంక అనుమతులు అవే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలంటే ముందు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వైఎస్ క్యాబినెట్‌లో ఆరుగురు టీఆర్‌ఎస్ మంత్రులు ఉండటంతో క్యాబినెట్‌లో చర్చించకుండానే సరాసరిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.


ఇది ఒకరకంగా తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా అవమానపర్చడమే. వైఎస్ చేసిన శంకుస్థాపనపై తెలంగాణ సమాజంలో, టీఆర్‌ఎస్ మంత్రుల్లో నాడు తీవ్ర అలజడి మొదలైంది. దీంతో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు నిరసనకు దిగారు. అదే సమయంలో కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు కేసీఆర్, నరేంద్ర సైతం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను నిలదీశారు. దీంతో నాడు సోనియాగాంధీ సూచన మేరకు దిగ్విజయ్‌సింగ్.. కేసీఆర్, వైఎస్‌తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కేసీఆర్ ప్రధానాంశంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాల్సిందేనని కోరారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. కానీ వైఎస్ మాత్రం దూకుడుగా పోలవరంపై ముందుకు వెళ్తుండటంతో రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులతోపాటు, కేంద్రంలో ఉన్న ఒక క్యాబినెట్, ఒక సహాయమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి దూకింది టీఆర్‌ఎస్.

పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలతో పాటు, సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తూ ముందుకుసాగుతున్నది. 2006-07లో టీఆర్‌ఎస్ తరపున ఎంపీ వినోద్, కేంద్ర జలవనరుల కమిషన్ మాజీ సభ్యుడు ఆర్ విద్యాసాగర్ సుప్రీంకోర్టులో కేసువేశారు. అదే సమయంలో తెలంగాణ జాగృతి తరఫున ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కవిత కూడా సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు 2007-08సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెస్తూనే ఉంది. ఈ అనుమతులన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడే ఉంటాయని ఆయా శాఖలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ర్టాల్లో కూడా సమస్యలొస్తున్నాయని ఛత్తీస్‌గఢ్, ఒడిశాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో చాలా రోజులుగా పోలవరంపై సుప్రీంలో స్టే కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెల్లవారే క్యాబినెట్ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్‌ను ఆమోదించడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది.

పోరాడుతున్న తెలంగాణ జాగృతి

పోలవరం ప్రాజెక్టు డిజైన్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ జాగృతి కూడా తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తూనే ఉంది. ఒక వైపు ప్రజాఉద్యమాల్లో భాగం అవుతూనే మరోవైపు కోర్టుల్లో న్యాయపోరాటాలు చేస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కవిత 2009 నుంచి పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2009లో సుప్రీంలో కేసు వేసిన ఆమె ఆ తర్వాత రాష్ట్రంలో టెండర్లు వేస్తున్నారని తెలిసి హైకోర్టులో మరో కేసు వేశారు. హైకోర్టు పోలవరం కేసులన్నీ కూడా సుప్రీంలో ఉన్నాయని చెప్పడంతో మరోసారి ఆమె సుప్రీంను ఆశ్రయించారు.

No comments:

Post a Comment